సోమనాథం వట్టి పిసినారి. తిని-తినక చాలా కూడబెట్టాడు.
అంతలో చుట్టు ప్రక్కల ఊళ్ళలో దొంగలు పడుతున్నారని సోమనాథానికి తెలిసింది. 'దొంగలు తమ ఊళ్ళోనూ పడచ్చు! తన ఇంటికే రావొచ్చు!' అని భయం వేసింది సోమనాథానికి. దాంతో తను కూడబెట్టుకున్న సంపదనంతా భద్రంగా దాచి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
భార్య సుగుణను పిలిచి- "మనం సంపాదించిన సంపద మొత్తాన్నీ రెండు భాగాలు చేసి పంచుకుందాం. నేను నా భాగాన్ని నాకు తెలిసిన చోట దాస్తాను. నీ భాగాన్ని నువ్వు నీకు తెలిసిన చోట దాచు. ఒక వేళ దొంగలు పడి మన ఇల్లు కొల్లగొడితే ఒక భాగం పోయినా ఇంకో భాగం దక్కుతుంది" అన్నాడు.
"మీరు చెప్పినట్టు చేస్తాను; కానీ నా భాగాన్ని నేను ఎక్కడ దాచానో మీరు అడగకూడదు" అంది సుగుణ.

'ఎక్కడైనా దాచి పెట్టనివ్వు, సొమ్ము క్షేమంగా ఉంటే అంతే చాలు' అనుకున్న సోమనాథం, ఆమె షరతుకు ఒప్పుకున్నాడు.
అలా 6 నెలలు గడిచాయి.
అనుకున్నట్లుగానే దొంగల ముఠా కళ్ళు ఊళ్ళోని భాగ్యవంతుల ఇళ్ళన్నిటిమీదా పడ్డాయి. అందరినీ‌ నిలువునా దోచారు. సోమనాథం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగల పాలయ్యాయి. 'పోనీలే, అయినా నేను దాచిన సొత్తంతా భద్రంగా ఉంది కదా!' అనుకొని నిబ్బరంగా ఉన్నాడు సోమనాథం. దొంగలు వెళ్ళిపోయాక తను సంపద దాచి పెట్టిన చోటుకు వెళ్ళి చూస్తే ఏముంది, అక్కడ చిల్లి గవ్వ కూడా లేదు!
సోమనాథం ఘొల్లుమన్నాడు. అంతలో భార్య సుగుణ వచ్చి ఓదార్చింది. ఆయన అడిగాడు భార్యని- "కనీసం నేను నీకు దాచమని ఇచ్చిన సొత్తయినా జాగ్రత్తగా ఉందా?" అని.
"జాగ్రత్తగానే ఉందిలెండి!" అన్నది సుగుణ.
"పద, చూద్దాం!" అని సోమనాథం తొందరపడ్డాడు.
సుగుణ సోమనాథాన్ని ఒక మురికివాడకు తీసుకెళ్ళింది. ఆ వాడ జనం మొత్తం పరుగున వచ్చి వాళ్ళిద్దరికీ మర్యాదలు చేశారు. "అమ్మా, మీరు చేసిన సాయం వల్ల మేము ఇలా చల్లగా బ్రతుకుతున్నాం. మీరు ఇచ్చిన డబ్బుతోనే మేము పొలాలు కొనుక్కొని సాగు చేసుకుంటున్నాం. మా పిల్లలు చదువుకుంటున్నారు; ఉద్యోగాలు చేస్తున్నారు. మా మాట ప్రకారం మేము ప్రతి నెలా మీకు కొంత డబ్బు, అలాగే పంటలో వాటాగా సంవత్సరానికి ఇంత ధాన్యం పంపిస్తాం" అన్నారు.
వాళ్ళ అభిమానం, గౌరవ మర్యాదలు చూసిన సోమనాథం కళ్ళు చెమ్మగిల్లాయి. "నేను దాచింది దొంగల పాలైంది, కాని నువ్వు దాచినది పదింతలై మనకు మంచి చేస్తోంది. ఒకప్పుడు సంపాదించడమే గొప్ప అనుకున్నాను. కానీ 'ఇతరులకు సహాయపడడం అంతకంటే గొప్ప' అని తెలియజేశావు నువ్వు. అసలైన సంపదంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు!" అన్నాడు సోమనాథం, విప్పారిన ముఖంతో .
భర్తలో వచ్చిన మార్పును చూసి సుగుణ ఎంతో ఆనందించింది.