కొత్తపల్లి జమీందారు కు ఒక సమస్య వచ్చి పడింది. ఇన్నేళ్ళుగా ఆయన అనేక పుస్తకాలు సేకరించి, అద్భుతమైన గ్రంధాలయం ఒకటి స్థాపించారు. ఆ గ్రంధాలయాన్ని ఇంత-కాలమూ సమర్థవంతంగా నడిపిన అలివేలమ్మ, ఇప్పుడు ముసలిదైంది. ఇంత పెద్ద లైబ్రరీని నడిపేందుకు ఆమెకు ఇప్పుడు శక్తి చాలటం లేదు. "ఆమె పదవీ విరమణ చేస్తే, ఇక గ్రంధాలయానికి దిక్కెవ్వరు?" అని జమీందారుగారు చాలా మధన పడి, చివరికి 'వేరే ఎవరినైనా పనిలోకి తీసుకుంటే తప్ప, లాభం లేదు" అని నిశ్చయించారు.

తన ప్రకటనకు బదులిచ్చిన అనేకమందిని విచారించి, రాముడు, సోముడు, భీముడు, వీరుడు అనే నలుగుర్ని 'అందరిలోకీ ఉత్తములు' అని తేల్చారాయన. అయితే వీళ్ళలో సరైనవారెవ్వరో తేల్చటం ఆయన వల్ల కాలేదు. తెలివితేటల్లో గాని, నీతి నిజాయితీల్లో గాని వీళ్ళు నలుగురూ సమానంగానే ఉన్నట్లున్నారు!

అందుకని ఆయన సరైన అభ్యర్ధిని ఎంపిక చేసుకునే బాధ్యతను అలివేలమ్మకే అప్పజెప్పాడు.

అలివేలమ్మ లైబ్రరీలోంచి తనకు నచ్చిన పాత పుస్తకం ఒకదానివి, నాలుగు ప్రతులు బయటికి తీసి పెట్టింది. అభ్యర్థులు నలుగురికీ తలకొక ప్రతినీ అందించి, ఆమె- "మీకు రెండు రోజుల సమయం ఇస్తున్నాను. ఈ రెండు రోజులూ మీరు ఇక్కడికి దగ్గర్లోనే, జమీందారు గారి బంగళాలో ఉండచ్చు. మూడవ రోజున మీకు ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్ష ఫలితాన్ని బట్టి, ఈ పనికి మీలో తగిన వారెవరో తెలుస్తుంది. బాగా శ్రద్ధగా చదవండి, మరి" అన్నది.

ఆ రోజు సాయంత్రానికల్లా రాముడు వచ్చి, అలివేలమ్మ ముందు కూర్చున్నాడు. "నేను పుస్తకాల్ని చాలా వేగంగా చదవగలను. మీరిచ్చిన ఈ‌పుస్తకాన్ని కూడాను, చదివేశాను. మీరు పరీక్ష పెట్టటం కోసం మూడు రోజులు ఆగవలసిన పనిలేదు. ఆ ప్రశ్నపత్రం ఏదో ఇచ్చేస్తే, నేను ఇప్పుడే పరీక్ష రాసేసి చక్కా పోతాను. సమయం‌ వృధా చేసేదెందుకు?" అన్నాడు. అలివేలమ్మ కొంచెం ఆలోచించి, అతనికొక్కడికే ప్రశ్నపత్రం‌ ఇచ్చింది. అతను త్వర త్వరగా జవాబులు వ్రాసి ఇచ్చి, వెళ్ళి వస్తానని శలవుకోరి, వెళ్ళిపోయాడు.

మరునాడు తెల్లవారాక, భీముడు, వీరుడు గ్రంధాలయానికి వచ్చి కూర్చున్నారు. "సోముడేడి?" అని అడిగింది అలివేలమ్మ. "అతను అక్కడే కూర్చొని చదువుతున్నాడు. మీరడిగే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉంటాయోనని, పుస్తకాన్ని మొత్తం రుబ్బేస్తున్నాడు" అన్నారిద్దరూ. "మరి మీరెందుకు వచ్చారు?" అన్నది అలివేలమ్మ. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తేలిందేమంటే, భీముడికి పుస్తకాలు పాతబడితే ఇష్టం లేదు! "మీ దగ్గర ఈ పుస్తకం ప్రతి బాగా పాతబడింది. చదివేందుకు అనువుగా లేదు. కొత్త ప్రతి ఏదైనా ఉంటే ఇవ్వండి" అన్నాడు భీముడు. అలివేలమ్మ నవ్వి, తన దగ్గరున్న కొత్త ప్రతి ఇవ్వగానే, అతను దాన్ని అందుకొని, వసతి గృహం వైపుకు బయలుదేరాడు.

"నీకు కూడా కొత్త పుస్తకమే కావాలా?" అడిగింది అలివేలమ్మ, అక్కడే కూర్చొని పుస్తకాలన్నిటినీ‌ పరిశీలిస్తున్న వీరుడితో. "లేదులెండి, అంత అవసరం లేదు- నేను కొంచెం సేపు ఇక్కడ కూర్చొని వెళ్తాను" అన్నాడు వీరుడు. ఆరోజున అతను అక్కడే కూర్చొని, గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలు చాలావాటిని తిరగేస్తూ గడిపాడు. "నీకు ఇచ్చిన పుస్తకం చదువుకో, మళ్ళీ పరీక్ష పెట్టినప్పుడు జవాబులు రాకపోతే ఎలాగ?" అన్న అలివేలమ్మకు అతని చిరునవ్వే సమాధానమైంది.

మరునాడు అలివేలమ్మ పరీక్ష పెట్టింది. జవాబులను దిద్దిచూస్తే, రాముడికీ, సోముడికీ నూటికి 92 మార్కులొచ్చాయి. భీముడికి 95, వీరుడికి అందరికంటే తక్కువ- 90 మార్కులు వచ్చాయి.

అలివేలమ్మను అడిగి సంగతంతా తెలుసుకున్న జమీందారుగారు నవ్వి, "ఉద్యోగాన్ని ఎవరికిద్దామంటారు, వీరుడికే ఇద్దాం, మరి?" అన్నారు.

అలివేలమ్మకూడా నవ్వి "నా ఎంపికా అదే!" అన్నది.

అక్కడే కూర్చొని అంతా చూస్తున్న పిల్లి, 'తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వీరుడికే ఎందుకిస్తున్నార'న్నట్లు, "మ్యావ్"మన్నది.