అది ఒక తాండా. తాండాలో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.

అది వేసవి కాలం. ఎప్పటి లాగే మగవాళ్ళు అంతా బయటి పనులకు వెళ్ళి ఉన్నారు. వడగాలులు బాగా వీస్తున్నాయి.

అంతలోనే ఎక్కడో నిప్పు రవ్వలు లేచాయి.

అంతే- తాండాలోని నాలుగైదు గుడిసెలు ఒక్కసారిగా అంటుకున్నాయి. గుడిసెలలో ఉన్న వాళ్లంతా భయంతో గబగబా బయటకు పరుగు పెట్టారు.

గుడిసెముందు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటోంది లచ్చిమి. ఈ మంటల్లో వాళ్ళ గుడిసె కూడా అంటుకున్నది.

లచ్చిమి వెనక్కి తిరిగి చూసేసరికి మంటలు పెద్దవయ్యాయి. ఒక్క క్షణం పాటు ఆ పాపకు ఏమీ అర్థం కాలేదు.

మరుక్షణంలో తమ్ముడు సోము గుర్తుకు వచ్చాడు. వాడు ఇంట్లో ఉయ్యాలలో పడుకొని నిద్రపోతున్నాడు! వాడికి ఇంకా ఉయ్యాల దిగటమే రాదు. అమ్మ-నాన్నలు వాడిని తనమీద వదిలి పనులకు వెళ్ళారు!!

లచ్చిమి తటాలున లేచి గుడిసెలోకి పరుగెత్త బోయింది. బయట మూగిన జనం హాహా కారాలు చేసారు.

"లోపలికి పోవద్దు- ప్రమాదం" అని అరిచారు.

కానీ లచ్చిమి భయపడలేదు. తనకు ఏమైతుందో తను అస్సలు ఆలోచించలేదు. "చిట్టి తమ్ముడికి ఏమీ కాకూడదు" అనేది ఒక్కటే ఆ పాప ఆలోచన.

చటుక్కున లోపలికి దూరిన లచ్చిమి గబగబా ఉయ్యాలలోంచి సోమును ఎత్తుకుని అదే పరుగున బయటికి వచ్చింది.

ఆ సరికే లచ్చిమి పరికిణీకి నిప్పు అంటుకున్నది. చుట్టు ప్రక్కల వాళ్ళు గబగబా ఆ మంటను ఆర్పేసారు. 'ఇంకాస్త ఆలస్యమైతే మంటల్లో చిక్కుకు పోయేవాళ్ళు. అయినా అంత సాహసం ఎలా వచ్చింది పాపా, నీకు? ప్రమాదం కాదూ?!” అంటూనే అందరూ లచ్చిమి సాహసాన్ని కొనియాడారు.