"తన శక్తి, ఇతరుల శక్తి ఎంతటివో తెలీక, క్రొవ్వు పట్టినట్లు ఎక్కువవాళ్లను ఎదిరించదలచిన వెఱ్ఱివాడు కష్టాలకు పుట్టినిల్లు అవుతాడు. ఇదివరకు ఒక పావురానికి ఇలాగే మదమెక్కి, ఒక డేగతో పోరు పెట్టుకొని భంగపడింది. నీకు ఆ కథ చెబుతాను విను- అని 'పావురాలజంట-డేగ' కథ చెప్పటం మొదలు పెట్టింది హంసరాజు.

పావురాల జంట-డేగ

పాండ్య దేశంలో మధుర అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలోని గుడినొకదానిని ఆశ్రయించుకొని ఒక పావురాల జంట నివసిస్తూ ఉండేది. ఒక రోజున ఆ జంట గుడి మంటపంలో‌ నేలమీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్న సమయంలో దూరం నుండి ఒక డేగ వాటిని చూసింది. వాటిని పట్టి తినాలని, అది ఆ మంటపంలోకి దూరేందుకు పలువిధాలుగా ప్రయత్నించింది. కానీ దాని పరిమాణం‌ పెద్దది కావటం చేత, అది లోనికి దూరలేకపోయింది. "వంట ఇంటి కుందేళ్ళేగదా, ఈ‌ పిట్టలు!? తప్పించుకొని ఎక్కడికి పోతాయిలే!" అనుకొని అది అప్పటికిగాను తన ప్రయత్నాన్ని విరమించుకొని గూటికి ఎగిరిపోయింది.

దాని ఈ ప్రయత్నాన్నంతా పావురాలు రెప్పలు ఆర్పకుండా నిలబడి చూశాయి. అప్పుడు ఆడపావురం తన భర్తతో అన్నది-"చూశావా? ఇప్పుడా డేగ మనల్ని పట్టుకొనేందుకని ఇక్కడికి వచ్చికూడా, ఈ కోట గోడలు మనకిస్తున్న రక్షణను ఛేదించలేక వెనక్కి మరలిపోయింది! మన వైపుకు అది ఎంత కోపంతో‌చూసిందో, నువ్వూ చూశావుగద! మనం చేసుకున్న పుణ్యం వల్ల, ఈ రోజుకు మనం‌ దాని పాలబడకుండా తప్పించు-కోగలిగాం. ఇక మీదట అది ఎప్పుడూ మనమీద కన్ను వేసే ఉంటుంది. కనీసం ఇప్పుడన్నా మనం ఈ చోటును విడిచిపెట్టి వేరే ఎక్కడికన్నా పోకపోతే, ఏదో ఒకరోజున దాని బారిన పడతాం. బలవంతులతో విరోధం‌ ఎంతటి వారికైనా సరే, మేలు కూర్చదు. అందుకని మనం ఈ ప్రదేశాన్ని వదిలి, డేగ భయం లేని వేరే సురక్షిత ప్రదేశానికి తరలి-పోదాం. "మా తాత త్రవ్వించిన చెరువు" అని దానిలో మునిగి చస్తామా, ఎక్కడన్నా? 'సరే, అదే నయం' అనుకుందామన్నా, ఇది మన పూర్వులు సంపాదించి పెట్టిన ఆస్తి ఎలాగూ కాదు. ఈ స్థలాన్ని పట్టుకొని వ్రేలాడనూ లేక, దీనినుండి బయటికి రానూ రాలేక, ఊరికే చచ్చిపోయేది ఎందుకు? ఇప్పుడిక ఈ శత్రువుకి తగిన ఉపాయాన్ని వెంటనే వెతకాలి- ఆలస్యం కూడదు. ఆలసించామంటే ప్రాణాలే కోల్పోతాం. అందుకని, ముందుగానే మేలుకోవటం అవసరం. ఎంత కష్టం వచ్చి-పడింది, మనకు?!" అని కళ్ళనీళ్ళు నింపుకొని, జీరబోయిన గొంతుతో ఏడ్చింది ఆడపావురం.

అప్పుడు మగపావురం దాని భయాలను కొట్టిపారేస్తూ, లేత నవ్వుతో ముఖం చివురించగా "ఎందుకు, ఇట్లా అర్థంలేని భయాలు పెట్టుకొని బాధ పడతావు? నా శక్తి ఎంతటిదో తెలీక మనసుకు అనవసరపు భయాలను అద్దుకుంటావెందుకు? 'ఉన్న ఊరు, కన్న తల్లి ఒకే రూపు' అని వినలేదా? తోటివాడి దెబ్బకు జంకి, ఉన్న ఇంటిని పాడుబెట్టి, పారిపోతే ఇరుగు పొరుగులు మనల్ని చూసి నవ్వరా? పరువు పోవటం తప్ప దీనివల్ల వేరేఎలాంటి లాభమూ లేదు. దైవం ఎదురొడ్డినప్పుడు మనం ఎలాంటి ప్రయత్నం చేసినా నీటిమీది రాతల్లాగా ఏలాంటి ప్రయోజనమూ ఉండదు. వెయ్యి ఉపాయాలు కూడా మన నుదుటి వ్రాతను మార్చలేవు. ఈ శరీరాన్ని ధరించిన వాడి సుఖదు:ఖాలు భగవంతుని కోరిక మేరకు ఏర్పడుతుంటాయి.

వాటిలో‌ మన ప్రమేయం ఏమీ ఉండదు. రమ్మంటే సుఖాలు వస్తాయా, పొమ్మని త్రోసివేస్తే కష్టాలు పోతాయా?

ఇంకోటి చెప్తాను, విను- 'ఎంత పరాక్రమవంతులైనా నా ముందు తల ఎత్తేందుకు భయపడతారు- తుచ్ఛమైన ఈ డేగ ఎంతటిది? డేగ కూడా ఒక రకపు పక్షే- దయ్యం కాదు గద, అది?! ఒక నీచపు డేగను తలచుకొని మనసులో ఇంత భయపడతా-వెందుకు? అది కూడా‌ పక్షే ; నేను కూడా‌ పక్షినే. ఎక్కడైనా ఒక వజ్రం‌ మరొక వజ్రం కంటే తక్కువదౌతుందా? ఎందుకు, ఊరికే పనికి-మాలిన పిరికితనాన్ని బోధిస్తావు, నాకు?

ఆ మోసకారి పక్షి మన మీదికి వస్తే ఒక్క ముక్కుపోటుతో దాన్ని చంపివేయనా? వజ్రంలాంటి నా వాడిగోళ్ళతో‌ దాన్ని చీల్చి చెండాడనా? గొప్పవాళ్ళు తమ శౌర్య పరాక్రమాలను క్రియారూపంగా చూపుతారు తప్పిస్తే, మాటల్లో ప్రకటించేందుకు ఇష్టపడరు. ఊరికే నాకు-నీకు వాగ్వివాదం‌ ఎందుకు? నువ్వు చూసి మెచ్చుకొనే సందర్భమూ వస్తుంది- నా మాట నమ్మి, ఆవగింజంత చింతకూడా లేక, నిశ్చింతగా ఉండు. మనకిప్పుడు వచ్చిన భయం ఏమీ లేదు' అని ఊరడించింది.

అది విని ఆ ఆడపక్షి భర్త మాటకు ఎదురు చెప్పటం ఇష్టం లేక, తన లోపలి ఆరాటం నుండి ఊరట లేక, మనను ఆందోళనతో‌ ఊగిసలాడగా, ముఖం వెలవెలపోగా వెర్రి నవ్వు ఒకటి నవ్వి ఊరుకున్నది.

ఇక ఆ డేగ కూడా‌ పగబట్టిన దానికిమల్లే మరునాడు ఉదయాన్నే- ఇంకా సూర్యుడు ఉదయించకనే- వచ్చి, ఆలయంనుండి బయటికి వెళ్ళేవైపుగా ఉన్న ప్రహరీగోడ మీద చూపు నిలిపి, మాటు వేసి కూర్చున్నది. సూర్యోదయం కాగానే పక్షులు రెండూ ఎప్పటి మాదిరి ఆహారంకోసం బయటికి వచ్చి ఎగిరి పోబోయాయి- అయితే ఆ నాటితో‌ ఆడ-పావురానికి మగపావురంతో‌ ఋణం తీరి-పోయింది కాబోలును- డేగ గబుక్కున వచ్చి మగ పావురాన్ని బలంగా తన ముక్కుతో కరచుకొని పోయి, ఆనాటి భోజనానికి దానినే తొలి ముద్దగా చేసుకొని, ఇష్టంగా భోంచేసింది.

ఆడపావురం‌కూడా పులినోట చిక్కిన మాంసం‌ జారి పడ్డట్లు, చావు తప్పి కన్ను లొట్టపోగా దేవాలయంలోకి దూరింది. ఎంతటివారైనా చేసుకున్న తప్పుల ఫలం అనుభవించి తీరాల్సిందే కదా! కాబట్టి బలవంతునితో విరోధం మనకే చేటు తెస్తుంది.

అంతేకాదు- ఎంత బలం ఉన్న వాడికైనా పరుషమైన మాటలు మేలు గూర్చవు. దానివల్ల అన్ని పనులూ నిష్ఫలమే అవుతాయి. గొడ్డలితో నరికిన చెట్లైనా తిరిగి చివురి-స్తాయేమోగాని, మాటల వల్ల విరిగిన మనసు మాత్రం‌ ఇక చక్కబడదు. నోటిమాట చక్కగా లేకనే గద, ఇదివరకు ఒక గాడిద అకాల మృత్యువు వాత పడింది?! నీకు ఆ కథ చెబుతాను, విను:

పులితోలు కప్పుకున్న గాడిద

కరిపురం అనే ఊళ్ళో విలాసుడు అనే చాకలివాడు ఒకడు ఉండేవాడు. ఆ చాకలివాడు పొరుగూరునుండి క్రొత్తగా ఒక గాడిదను పట్టి తెచ్చుకున్నాడు. దాన్ని బాగా మేపి బలిసేటట్లు చెయ్యాలని ఉబలాట పడ్డాడతను. అయితే అంత మేతను కొని తేలేక, 'తగిన ఉపాయం ఏమిటా' అని ఆలోచించాడు.

చివరికి అతనికో ఉపాయం‌ తట్టింది. ఆ గాడిద ఒంటిమీద ఒక పులితోలు కప్పి, అప్పుడప్పుడు అడవికి దగ్గరగా ఉన్న పొలాలలోకి తోలటం మొదలు పెట్టాడు. ఆ పొలాల కాపులు రాత్రిపూట మసక వెలుగులో పులి తోలు కప్పుకున్న ఆ గాడిదను చూసి 'నిజం పులే' అనుకుని భయంతో కంపించి పోయేవాళ్ళు. దాని దగ్గరికి వచ్చేందుకు కూడా‌ భయపడి అటునుండి అటే పారిపోయేవాళ్ళు. ఆ విధంగా నిరాటంకంగా ఎల్లప్పుడూ పచ్చని పైరుగడ్డి కడుపారా దొరకటం చేత, దాన్ని మేసీ మేసీ‌ గాడిద బాగా బలిసి, ఇష్టం వచ్చినట్లు నిర్భయంగా తిరగటం మరిగింది.

ఇట్లా‌ కొంత కాలం గడిచింది. అడవికి దాపులనున్న పొలపుకాపు ఒకడు 'తన పొలం అట్లా నశించిపోతున్నదే' అని చాలా బాధపడ్డాడు. బాగా ఆలోచించి, చివరికి మనసును గట్టిపరచుకున్నాడు. గుండెను రాయి చేసుకున్నాడు; 'సాహసోపేతమైన పని చెయ్యాల్సిందే- పులి అంతు తేల్చాల్సిందే' అనుకున్నాడు. ఒకనాటి రాత్రి బూడిదరంగు దుప్పటిని ఒంటినిండా కప్పుకొని, పొలంలోకి దూరాడు. ఆ పొలానికి అవతలివైపున ఉన్న ఒక పెద్ద చెట్టు మాటున, కంటి రెప్ప వాల్చకుండా నిలబడ్డాడు- ఒక బాణాన్ని ధనుస్సుకు పూన్చి.

తన అలవాటు ప్రకారం పొలంలో మేసేందుకు వచ్చిన గాడిద, దూరంగా చెట్టు నీడన ఉన్న ఆకారాన్ని చూసి, చీకట్లో మరొక గాడిద అనుకున్నది. కాలం‌ మూడింది కాబోలు, అది గట్టిగా ఓండ్ర పెడుతూ ఆ రూపం వైపుకు పరుగు పెట్టింది.

ఆ అరుపును విన్న పొలంకాపు నిర్ఘాంతపోయి, మరు నిముషంలో వాస్తవాన్ని గ్రహించాడు. చిరునవ్వుతో అతని ముఖం పదింతలైంది. "ఓరి! ఈ కిలాడి గాడిదా, ఇన్నాళ్ళూ మా అందరి కళ్ళూ కప్పింది!" అని అతను నిర్భయంగా దాని దగ్గరికిపోయి, ఒక పెద్ద కట్టెతో ఆ గాడిదను మోది అవలీలగా దాన్ని యమపురికి పంపించాడు.

కాబట్టి, మాట తీరు బాగుండటం అవసరం. మాటలోని పరుషత్వం ఎప్పుడైనా గానీ‌ తప్పకుండా కీడునే‌ తెచ్చిపెడుతుంది. కాబట్టి, తన మేలు కోరేవారు ఎవరైనా అది తెలుసుకొని, అణగి మణగి ఉండాలి. సరే, అది అటుండనివ్వు- తర్వాత ఏం జరిగిందో చెప్పు" అన్నది. అప్పుడు కొంగ తన కథనాన్ని ఇలా కొనసాగించింది:

పక్షులతో యుద్ధానికి కూడా సిద్ధపడి నిలిచానని చెప్పాను కదా, ఇందాక? అట్లా స్థిరంగా నిలిచిన నన్ను చూసి పక్షులన్నీ మరింత రెచ్చిపోయాయి.
"ఓ స్వామిద్రోహీ! తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, మా దేశంలోనే తిరుగుతూ మా రాజులో తప్పులెంచుతావా? అందుకు శిక్షగా నిన్ను ఈ క్షణంలోనే వధించవలసి ఉన్నది. అంతటి పాపానికి ఒడి కట్టిన నీ‌ పట్ల కొంచెం‌ కూడా‌ దయ చూపవలసిన అవసరం ఉన్నదంటావా?

తిన్నది అరగక, కాలం గడవక, నోటి తీటతో ఇంతవరకూ తెచ్చుకున్నావు. చేసుకున్న పాపాన్ని అనుభవించక తప్పదు. మేం ఎవరం అనుకున్నావు? శౌర్యమే అలంకారంగాగల చిత్రవర్ణుడి అనుచరులం మేము. తెలీదా?

(ఇంకా ఏమన్నాయో మళ్ళీ...)