ఒక ధనవంతుడి ఇంట్లో  ఒక కుక్క, మేక, కోడి,  రామచిలుక పెరుగుతున్నాయి.    
   ఒకరోజున "తమలో ఎవరు గొప్ప?" అనే చర్చ మొదలైంది, వాటి మధ్య .    
   ముందుగా కోడి ఇలా అన్నది: "నేను పెట్టిన  గుడ్లతో మన  యజమాని లక్షలు సంపాదించాడు. అంతే కాదు నా మాంసం  కూడా వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అందుకని  నేనే  మీ అందరికన్నా గొప్పదాన్ని" అని.    
   అని అదివిని కుక్క  నవ్వి , "పోవోయ్ , పెద్ద చెప్పొచ్చావ్! ఆయన లక్షలు సంపాదించినా, వాటికి  కాపలా కాసేది నేనే కదా?! సంపాదించడం  కన్నా, ఆ సంపాదించిన దాన్ని  కాపాడుకోవడం మరింత కష్టం - కనుక  నేనే మీ అందరికన్నా  గొప్ప" అన్నది.     
   అప్పటిదాకా మౌనంగా ఉన్న మేక  నవ్వుతూ అన్నది-"మనిషి ఎంత సంపాదించినా, ఆరోగ్యం కావాలి- లేకపోతే ఏం లాభం? నా పాలు తాగడం వల్లే మన  యజమాని ఆరోగ్యంగా  ఉండగల్గుతున్నాడు. అంతే కాదు-గాంధీ తాత  అంతటివాడు  కూడా నా పాలు తాగేవాడు  తెలుసా? అందుకని  నేనే  మీ అందరికంటే గొప్పదాన్ని" అన్నది మేక. 
   అప్పుడు పంజరంలోంచి  అందరి మాటలూ వింటున్న చిలుక  అన్నది: "మనిషికి  ఎంత  సంపద ఉన్నా, మానసిక ప్రశాంతత కరువైతే ఏం ప్రయోజనం? నా ముద్దు ముద్దు మాటలతో మన  యజమానిని  ఎంతగానో ఆనందపరుస్తున్నాను. ఆయన వ్యాపారరీత్యా  ఎక్కడెక్కడో తిరిగి, అలిసిపోయి  ఇల్లు చేరుకుంటాడు. ఆ సమయంలో  ఆయనకు  నా మాటలు ఎంతో  ఆనందాన్ని కల్గిస్తాయి; శాంతినిస్తాయి. ఇప్పుడు చెప్పండి-'మీ అందరికంటే  నేనే గొప్ప- ఒప్పుకుంటారా, లేదా?' అన్నది చిలుక.     
   ఇంతలో వాళ్ల వెనుక నుంచి 'నేను ఒప్పుకోను' అని వినిపించింది. వాళ్ల  యజమాని మాటలు విని  అవన్నీ  ఉలిక్కిపడ్డాయి-    
"మీ కన్నా గొప్పవాడిని నేనే! మీ అందరినీ  నా  అవసరాలకి  ఉపయోగించుకుని  నేను   ఎన్నో పనులు  చేయగల్గుతున్నాను. ఇంకా  ఎన్నో క్రొత్త క్రొత్త  విషయాలు కనిపెట్టగల్గుతున్నాను! కాబట్టి  మీ అందరికంటే  నేనే  గొప్పవాడిని-  ఏమంటారు?" అంటూ వాటివైపు చూశాడు.    
   అవన్నీ  ఏకీభవిస్తున్నట్లు తలలు ఊపాయి.
