ఆ మాటలు విని, సింహం "హరిహరీ!" అని చెవులు మూసుకుని, "ఎంత మాట వినాల్సి వచ్చింది!? ఇంత కాలం పాటు కాపాడి, ఇప్పుడు ఒక్క రోజుకు సరిపడా ఆహారం దొరకలేదని మిమ్మల్ని తింటే, ప్రజలు నన్ను తప్పు పట్టరా? ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు కట్టి పెట్టండి." అన్నది.
అప్పుడు నక్క కాకిని చూసి-"నువ్వు చాలా చిన్నదానివి. నిన్ను తిన్నంత మాత్రాన రాజుగారి కడుపు నిండదు. ప్రక్కకు జరుగు- నా శరీరాన్ని ప్రభువుల వారికి అర్పించి, కృతార్థుడినైతాను" అన్నది.

అదివిని పులి- "కాకి కంటే నువ్వు కొంచెం పెద్ద దానివే; అయినా నీ మాంసం కూడా రాజుగారి ఆకలిని తీర్చేందుకు సరిపోదు. నేను భోజనమౌతాను రాజుగారికి!"అన్నది నక్కతో.
అప్పుడు నక్క దానితో- "నువ్వు బలశాలివి. ఇవాళ్ల కాకపోతే రేపైనా రాజుగారిని పోషించే సమర్థత నీకున్నది. నీ తర్వాత మేం ఉండీ ప్రయోజనం లేదు- కాబట్టి నీ మాటల్ని పట్టించుకోకూడదు" అని పోట్లాడింది.
వాళ్ళు ముగ్గురూ ఇట్లా తగవులాడుకొంటూ ఉండగా అక్కడికి వచ్చింది, ఒంటె. అవన్నీ తమ తమ కథనాలు వినిపించాయి దానికి. అంతావిని అది-"ఏమి చేయాలో తోచనట్లు, ఇట్లా ఊరికే పెనుగులాడుతారెందుకు? ఈ పనికి సరిగ్గా సరిపోయేది నేనే! నన్ను చంపటం వల్ల ప్రభువులవారికి పాపం అంటదు-ఎందుకంటే, 'మన యీ శరీరం బాగుంటే దేన్నైనా సాధించవచ్చు; ధర్మాన్ని సాధించేందుకు మొదట కావలసింది శరీరమే' అని పెద్దలు చెబుతారు. సేవకుడు యజమాని మేలు కోరి పనిచేస్తూ మరణిస్తే నేరుగా స్వర్గ లోకపు సుఖాలను అనుభవిస్తాడు. అంతకంటే మంచి సంగతి ఇంక వేరే ఏదీ ఉండదు" అనేసింది.

అటుపైన అది సింహం వైపు చూసి "మీరు నన్ను చంపండి. దీనికి గనక మీరు ఒప్పుకోకపోతే మీ కోసం మేం‌ అందరం ప్రాణాలు విడిచేస్తాం" అన్నది. సింహరాజు దానిని తేరి పార చూశాడు. అంతలో నక్క కల్పించుకొని "ఈ ఒంటె చెబుతున్నది సరైనదే. ఆలోచన మాని, ఇది చెప్పినట్లు చేయండి. మేం అందరం ధన్యులమౌతాం" అన్నది. దాంతో ఇక ఆకలి బాధను భరించలేని ఆ సింహం ఒంటెను చంపి తినేసింది-
కాబట్టి, కొత్త సేవకుడితోటి రాజులుగానీ, అతని అనుచరగణం గానీ మనస్ఫూర్తిగా దగ్గర కాలేరు. పాములు చేరిన గంధపు చెట్టు మాదిరి, నీచులతో కూడుకొని ఉన్న రాజు- తన దగ్గర చేరిన వాళ్లకు అందరికీ ఆపదలే తెచ్చిపెడతాడు. అందుకని, అట్లాంటి వాడికి దగ్గరవ్వాలంటే ప్రతివాళ్ళూ భయపడతారు. దీనికి నిదర్శనంగా నేనో కథ చెబుతాను విను- అని 'వడ్రంగి-సింహం' కథను చెప్పసాగింది.
వడ్రంగి-సింహం
ఒక పట్టణంలో మంచి వడ్రంగి ఒకడు ఉండేవాడు. అతను అవసరం పడ్డప్పుడల్లా అడవికి వెళ్లి, తన పనికి సరిపోయే చెట్టును నరికి, స్తంభం మాదిరి చెక్కి, ఊరికి తీసుకు వచ్చి, దానితో రక రకాల వస్తువులు చేసి, అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు.

అతను అట్లా ఒక రోజున అడవిలో తిరుగుతూ ఉండగా, అకస్మాత్తుగా "సుహృద్విలోచనం" అనే సింహం ఒకటి వచ్చి, ఎదురుగా నిలుచున్నది. అతను చేష్ఠలు ఉడిగి నిల్చుండిపోయాడు.
అప్పుడా సింహం అతనిని చూసి, జాలిపడి, "ఏనుగుల కుంభస్థలాలను చీరి ముక్కలు చేస్తాయి, నా యీ గోళ్లు. బలహీనులు, జాలి చూపదగినవారు అయిన నీలాంటి అర్భకులపైకి రావటానికి ఈ గోళ్లు ఇష్టపడవు- భయపడకు" అన్నది.
అతను వెంటనే దాని ముందు సాగిలపడి మ్రొక్కి , పలు విధాలుగా దాని శౌర్యాన్ని ప్రస్తుతించి, దాని అనుమతి తీసుకొని ఇంటికి పోయాడు.

ఆనాటి నుండీ అతను దాని పట్ల కృతజ్ఞుడై, అనేక రకాల మధురమైన ఆహార పదార్థాలను దానికి తెచ్చి ఇచ్చి, తృప్తి పరుస్తూ ఉండేవాడు.
ఇట్లా కొన్ని రోజులు గడిచింది. ఒకనాడు ఆ సింహరాజు తన అనుచరులైన కాకి -నక్కలతో ఇష్టంగా అవీ-ఇవీ మాట్లాడుతుండగా, అవి అన్నాయి- "దేవరవారు కొన్ని రోజులుగా వేటకు వెళ్లటం లేదు- కారణం ఏమిటో తెలియరాలేదు, మాకు!" అని.
అది విని సింహం -"వడ్రంగి ఒకడు, నా భక్తుడు- ఉన్నాడు. అతను ప్రతి రోజూ నాకు సరిపడా ఆహారం తెచ్చి ఇస్తున్నాడు" అని చెప్పింది. వెంటనే అవి "ఆహా! మీకు ఇంత సేవ చేస్తున్న ఆ పుణ్యాత్ముడు ఎవరో గాని, మంచి వాళ్లలో కెల్లా మంచివాడు అయి ఉండాలి! ప్రభువుల వారి ఆజ్ఞ అయితే, ఆ మహానుభావుడిని మా కళ్లారా చూసి, తరిస్తాము" అన్నాయి.
సింహం "సరే "అని, "అతను - అదిగో, ఫలానా సమయానికల్లా వచ్చేస్తాడు- ఉండండి" అన్నది.
అనుకున్న సమయానికే అక్కడికి చేరుకున్నాడు వడ్రంగి. అయితే కాకి-నక్కలను చూడగానే అతను విపరీతంగా భయపడ్డాడు. గబగబా పరుగెత్తి, దగ్గరలో కనబడ్డ చెట్టు పైకి ఎగబ్రాకి కూర్చున్నాడు.
సింహం ఆ చెట్టు దగ్గరికి పోయి , క్రింద నిలబడి "ఓ స్నేహితుడా! ఎందుకు, ఇలా యీ చెట్టెక్కి కూర్చున్నావు?" అని అడిగింది.
"దుర్మార్గులుగాను, చావు తెలివిగల వాళ్లుగాను పేరు గాంచిన కాకి-నక్క నీతోపాటు ఉండటం చూశాను గనుక, చెట్టెక్కి కూర్చున్నాను. చెడ్డవాళ్లతో కూడిన రాజును ఎప్పుడూ నమ్మరాదు" అన్నాడు వడ్రంగి.

ఆ పైన అతను కదలకుండా ఆ చెట్టుమీదనే కూర్చొని, ఏదో బిడారు ఒకటి తన సమీపంలోకి రాగానే, ఆ వర్తకులను దగ్గరికి పిలిచి, వాళ్ళందరితోటీ కలిసి భద్రంగా అడవిని దాటి వెళ్లిపోయాడు. మంచివాడే అయినప్పటికీ చెడ్డవాళ్లతో సహవాసం చేయటం వల్ల చెడ్డవాడుగానే పరిగణింపబడతాడు. కొంగల గుంపులో జీవించే హంసను కూడా కొంగ అనే అనుకుంటారు గదా? రాజు గనుక మంచివాడు అయితే, అతని అనుచరులు కూడా మంచి వాళ్లు అవుతారు- "యథా రాజా తథా ప్రజా"- రాజు ఎలాంటి వాడైతే ప్రజలు అలాంటి వాళ్లౌతారు. మన ప్రభువుకు దగ్గరలో ఉండేవాడే, ఎవరో దుర్మార్గుడు- నామీద చాడీలు కథలు కథలుగా కల్పించి చెప్పి, ఆయనకు నా మీద అంతులేని కోపం తెప్పించి ఉంటాడు. అయినా జరిగిపోయిన దానికి విచారించి ఏమీ లాభం లేదు. ఊరికే చనిపోయేదెందుకు? పోరాడతాను- ఒకవేళ గెలిచాననుకో- కీర్తి సంపదలు పొంది సుఖంగా జీవిస్తాను. లేదా, శూరులైన వాళ్లందరూ మెచ్చుకునేట్లు పోరాడినా కూడా ఓడిపోయానే అనుకో; అప్పుడు విజయ స్వర్గం పొంది సుఖిస్తాను. అందువల్ల ఎటు చూసినా ఇంక పోరాటమే, తప్పదు!" అన్నది ఎద్దు.
అప్పుడు దమనకం "నువ్వన్నది నిజంగానే శూరులైన వాళ్లు మెచ్చేమార్గం. అయినప్పటికీ, ఏదైనా ఉపాయంతో శత్రువులను తప్పించుకొనిపోవాలి. సామ-దాన-భేద-దండోపాయాలలో చివరిది పోరాటం. అది మంచిదే, గౌరవనీయమే- కానీ వీరమరణమే గొప్పదని భ్రాంతి చెంది, గొప్ప వాళ్ళతో ఢీ కొని చచ్చిపోవటం సరైన పని కాదు. "జీవన్ భద్రాణి పశ్యతి"-ప్రతి జీవీ భద్రంగా ఉండాలనుకుంటుంది- అని పెద్దలు చెబుతారు. దాన్ని పాటించాలి గదా? మన వల్ల అయ్యే దాన్నీ, శత్రువు బలాబలాలనూ- రెండింటినీ తెలుసుకొని, ఒకసారి 'జయం నిశ్చయం' అని స్థిర పడ్డాక, పోరాటం మొదలు పెట్టాలి. అలా కాక పోతే పరువు చేటు తప్పదు.

గతంలో సముద్రుడంతటి వాడు కూడా ముందు వెనుకలు ఆలోచించకుండా ఒక తీతువు పిట్టను ఓడించాలని చూసి, తనే ఓడిపోయి పరువు పోగొట్టుకున్నాడు. ఆ కథ చెబుతాను విను-" అని 'తీతువు-సముద్రం' కథను ఇట్లా చెప్పసాగింది: తీతువు పిట్ట- సముద్రం
సముద్రపు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. దానిమీద గూడు కట్టుకొని ఒక తీతువు పిట్ట, దాని భార్య నివసించేవి. కొంతకాలానికి ఆ ఆడపక్షి గుడ్లు పెట్టే సమయం వచ్చింది. మొదటిసారి తండ్రి కాబోతున్న మగపిట్టకు చాలా సంతోషం వేసింది. అది చాలా ప్రేమగా భార్యను చేరి, "నీకేది ఇష్టమో అడుగు, ఎంత శ్రమపడైనా సరే, నీ కోరిక నెరవేరుస్తాను" అన్నది. అప్పుడు ఆడపక్షి దానితో "చాలా కాలంగా నా మనసులో కొంత భయం ఉన్నది- అమావాస్య-పౌర్ణమి రోజుల్లో సముద్రుడి అలలు ఆకాశమంత ఎత్తుగా ఎగురుతాయి. మనగూడేమో ఉన్నది చాలా తక్కువ ఎత్తులో. అందుకని నేను పెట్టిన గుడ్లన్నీ నీట కలసిపోయే ప్రమాదం ఉన్నది. నువ్వు ఇప్పుడు త్వరగా మన గూటికి తగిన వేరేచోటును వెతికి పెట్టు. అక్కడికి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకు- పురుటి సమయం దగ్గరపడ్డాక వేరే చోటికి మారటం కష్టం అవుతుంది " అన్నది.
అప్పుడు మగపిట్ట భార్య భయాల్ని కొట్టి పడేసి నవ్వుతూ "కలువపూల గుంపుకు చందమామ, తామరపూల దండుకు సూర్యదేవుడు, వానకోయిలల సమూహానికి మేఘుడు ఏవిధంగా రాజులో, అట్లాగే మన పక్షిజాతికి ప్రభువు గరుత్మంతుడు. ఆయన చాలా బలశాలి. తన రెక్కల్ని ఆడించగా వచ్చిన గాలితో ఎంతటి నీళ్ళనైనా ఎగరగొట్టగల సమర్థుడు. ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నాం, మనం- ఆయన జాతి వాళ్లం!- అట్లాంటి మనల్ని, ఈ సముద్రుడు అంత తేలికగా ముంచెత్తగలడా?!

అయినా నా శక్తి ఎంతటిదో తెలియని దానికి మల్లే నువ్వు ఎందుకు, ఇట్లా అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటావు? కులాసాగా ఉండు!" అన్నది.
అప్పుడా ఆడపిట్ట "ఎంతగొప్పవారైనా సరే, రాబోయే ప్రమాదాన్ని- అందునా ప్రాణాపాయం కలిగించే సమస్యను- ముందుగా గమనించుకొని, దానికి తయారుగా ఉండాలిగాని, 'బలవంతుడిని కదా, నాకేం అవుతుంది?' అని గర్వంతో మిడిసిపడి, అప్రమత్తంగా ఉండకూడదు అని పెద్దలు చెబుతారు. ఇక నావంటి బలహీనుల సంగతి ఏం చెప్పాలి? మంచిమాటలు చెవిన వేసుకొనని మూర్ఖుడు 'కోల విడిచి పడిన తాబేలు' మాదిరి, కష్టాల పాలౌతాడు. నీకు ఆ కథ చెబుతాను విను- అని తాబేలు-హంసల కథను చెప్పసాగింది: హంసలు-తాబేలు
ఒక అడవిలో భువనసారం అనే కొలను ఒకటి ఉండేది. చాలా చక్కని ఆ కొలను చుట్టూ కొంగలు, హంసలు, మరెన్నో రకాల నీటి పక్షులు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేవి. ఆ కొలనులో ఎన్ని తెల్లతామరలు పూచేవంటే, వాటి లోంచి జాలువారే చిక్కని మకరందాన్ని చూసి నివ్వెరపోయిన తుమ్మెదల గుంపులు వాటి చుట్టూ "ఝుం ఝుం" అని ఎంత తిరిగినా ఆ మకరందం అయిపోయేది కాదు! ఆట్లాంటి ఆ కొలనులో 'కంబుగ్రీవం' అనే తాబేలు నివసిస్తూ ఉండేది. 'వికటం, సంకటం' అనే రెండు హంసలు, దాని స్నేహితులు.
ఒక సంవత్సరం పెద్ద కరువు వచ్చింది. ఆ కొలనులోకి చేరుకునే వాగులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. కొలనులోని నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా ఇగిరిపోవటం మొదలైంది. హంసలు రెండూ ఆ కొలనును విడిచిపెట్టి వేరే చోటికి వలస పోదామని నిశ్చయించుకున్నై. పోయేముందు అవి తాబేలు దగ్గరికి వచ్చి ఆ సంగతి చెబుతుంటే, దు:ఖంతో వాటి గొంతులు పూడిపోయాయి. "మన స్నేహాన్ని మరువకు మిత్రమా, మనకీ ఎడబాటు తప్పదు- పోయి వస్తాం" అని అవి చెబుతుంటే తాబేలుకు కూడా అంతులేని విచారం వేసింది. దు:ఖంతో ముఖం ఉబ్బగా, అది- "చాలా కాలం పాటు అన్నదమ్ములలాగా కలసి మెలసి జీవించాం. మనం విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురౌతాయని కలలో కూడా అనుకోలేదు. నాకూ మీతోపాటు రావాలని ఉంది- కానీ మీరేమో పక్షులు- మీకు రెక్కల బలం ఉంది. మీకు ఇష్టం వచ్చిన చోట్లకల్లా మీరు ఎగిరి పోగలరు. నేను అలా కాదుగదా! సరే, నాకు లేని వాటి సంగతిని అటుంచండి. మిమ్మల్ని నేను వేడుకొనేది ఒక్కటే- మన స్నేహం సాక్షిగా మీరు నా ప్రార్థనను అంగీకరించాలి. ఏదో ఒక మార్గం ఆలోచించండి- మీతోబాటు నన్నూ తీసుకుపోండి. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను" అన్నది.
(మిగతాది మళ్ళీ...)