ఒక ముస్లిం ఖాజీగారు ఓ రోజున మసీదులో ప్రవచిస్తున్నారు: పాపాలు చేసినవారికోసం నరకంలో ఎలాంటి శిక్షలు ఎదురుచూస్తున్నాయో మహోత్సాహంగా వివరిస్తూ పోతున్నారు.

ఆయన వాక్ప్రవాహం కట్టలు తెంచుకొని పారుతున్నది. -ఆ సమయంలో శ్రోతల్లో ఒక పేదరైతు కళ్ళలో కన్నీటిని గమనించి ఆయన మరింత ఉత్సాహ పడ్డాడు.

రైతు కన్నీళ్ళు చారికలు కట్టేలా ఏడుస్తున్నాడు కూర్చుని.

"ఓహ్, నీ పాపాలు ఈనాటికి నిన్ను భయపెట్టాయన్నమాట! నువ్వు చేసిన పాపాలు గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా, ఇప్పుడు?" అడిగారు ఖాజీగారు, సూటిగా- తన వాక్యాలు శ్రోతలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో చూసుకొని గర్వపడుతూ.

"నా మాటలు తూట్లు పొడిచాయి కదూ, నిన్ను!? నేను నరకపు జ్వాలల గురించి చెబుతున్నప్పుడు నీకు నీ పాపాలు గుర్తొస్తున్నాయి, కదూ?"

'లేదు, లేదు!" అన్నాడు రైతు కన్నీళ్ళు తుడుచుకుంటూ. "నేను నా పాపాన్ని గురించి కాదు, ఆలోచిస్తున్నది. పోయిన సంవత్సరం రోగం వచ్చి, అన్యాయంగా చచ్చిపోయిన నా మేకపోతును గురించి ఆలోచిస్తున్నాను నేను. పాపం! ఎంత నష్టం! నా మేకపోతుకు చక్కని గడ్డం ఉండేది- అచ్చు మీ గడ్డం లాంటిదే! నా మేకపోతు గడ్డంతో అంతగా సరిపోలే గడ్డం నాకు ఇంతవరకూ తారసపడలేదు!" అన్నాడు రైతు అమాయకంగా.

ఇది విని, చుట్టూ ఉన్న రైతులందరూ విరగబడి నవ్వారు.

ఖాజీగారు పవిత్ర ఖురాన్ శరణు జొచ్చారు మళ్ళీ.