మీర్జాపురాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మంచి రాజే, కానీ "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.

అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా అందులోకి లాగసాగాడాయన- "మీరేమంటారు మంత్రిగారూ?!" అని.

మంత్రిగారికి ఊపిరాడలేదు. 'ఎలాగైనా విజయుడిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే' అనుకున్నాడు ఆయన.

పైకి మటుకు "మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ. మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.

దాంతో విజయుడికి ఉత్సాహం ఆగలేదు. 'ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు- ఆవుల్ని మేపుకుంటూ.

"ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.

"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.

పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.

"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?" అడిగాడు విజయుడు.

'గాలి' చెప్పాడు పశువుల కాపరి.

అన్నింటికంటే ఉత్తమమైన జలం?

'గంగాజలం'

అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?

'ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే'

"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.

ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.

"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.

"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ..." అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.

"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.

"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి.

"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.

"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే 'ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"

విజయుడు నివ్వెరపోయాడు. "అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, 'అందరిలోకీ తెలివైనవాళ్ళు' అంటూ అసలు ఎందుకుండాలి?" అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించి, కొత్తగా అందుకున్న సుజ్ఞానంతో బాటు కోటకి తిరిగి వచ్చాడు విజయుడు.

అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు! అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా 'మంచి రాజు - అందరినీ ప్రోత్సహిస్తాడు' అని పేరు తెచ్చుకున్నాడు.