అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు లేరు. అందుకని రాణి ఎన్నో రోజులు ఉపవాసం ఉండి, ఎన్నో పూజలు చేసింది; ఎందరికో దాన ధర్మాలు చేసింది. రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా, ధర్మ బద్ధంగా పాలించాడు.

ఒక రోజు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. రాజు, రాణి సాధువు దగ్గరికి వెళ్ళారు. సాధువు ఆ దంపతులకు ఒక మామిడిపండు ఇచ్చాడు. "దీన్ని టెంకతో సహా తినెయ్యాలమ్మా, మరి ఎలా తింటావో నీ ఇష్టం!" అన్నాడు సాధువు.

రాణికి మామిడి పండ్లంటే ఇష్టమే; ఆమె దాన్ని తిన్నది- కానీ టెంకతో సహా తినమంటే ఎలాగ? అందుకని ఆమె తను పండుని తిని, టెంకని మటుకు రాజభవనంలోంచి బయటికి విసిరేసింది.

అప్పటి నుండి తొమ్మిది నెలల తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి 'సాహసవీరుడు' అని పేరు పెట్టారు వాళ్ళు. అతనుకూడా పేరుకు తగ్గట్లే రకరకాల విద్యలు నేర్చుకున్నాడు. వాళ్ల రాజ్యంలో అతన్ని మించిన యోధులు లేరు అన్నట్లు తయారయ్యాడతను.

ఆలోగా, రాణి విసిరేసిన టెంక రాజ భవనం ప్రక్కనే మొలిచి, కాల క్రమంలో పెద్ద వృక్షమే అయ్యింది. దాని పళ్ళకు వింత శక్తి ఒకటి ఉన్నదని, త్వరలోనే అందరికీ తెలిసింది- వాటిని తిన్నవాళ్లకు అమితమైన శక్తి లభిస్తుంది!

అయితే "ఆ చెట్టు పండ్లు దుర్మార్గుల పాలబడితే ఎలాగ?" అని రాజుగారు దాని చుట్టూ కాపలా ఏర్పాటు చేసి, దాని పళ్ళు ఎవరికీ అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఒక నాడు రాజుగారి జైలులోంచి తప్పించుకున్న దుర్మార్గుడొకడు ఆ చెట్టు చుట్టూ ఏర్పరచిన సైనికులందరినీ ఏమార్చి, చెట్టును చేరుకున్నాడు. గబగబా ఆ చెట్టు కాయలు ఒక పదింటిని తినేశాడు కూడానూ. దాంతో వాడికి విపరీతమైన శక్తి వచ్చేసింది. వాడి శరీరం కూడా బలంగా, సైనికుల బాణాలకు దెబ్బతిననట్లు మారిపోయింది. దాంతో వాడు ఆ చెట్టుని కూకటి వేళ్లతో సహా పెకలించేశాడు; సైనిక వలయాన్నంతా చిందరవందర చేసి, దొరికిన వాళ్లనల్లా చంపేసి, రాజ్యంలో భీభత్సం సృష్టించటం మొదలుపెట్టాడు.

రాజ్యంలో ఎవరికీ వాడిని ఎదిరించే ధైర్యం లేకపోయింది. అందరూ రాజ్యాన్ని విడిచి పారిపోవటం మొదలుపెట్టారు.

సంగతి తెలిసిన సాహసవీరుడు రాజుగారిని కలిసాడు. తాను ఆ రాక్షసుడిని ఎదిరిస్తానన్నాడు. రాజుగారు పుత్రప్రేమను ప్రక్కన పెట్టి "సరే" అని అనుమతినిచ్చారు.

సాహస వీరుడు గ్రంధాలను వెతికి, ఆ చెట్టు గురించిన రహస్యాన్ని తెలుసుకున్నాడు: 'ఆ కాయలు తిన్న వారికి అపరిమితమైన శక్తి వస్తుంది- కానీ, వాటిని తిన్నవాళ్ళు నీళ్ళలోకి దిగితే మటుకు వాళ్ల శక్తి క్షీణిస్తుంది!'

రహస్యం తెలిసాక సాహసవీరుడికి చాలా సంతోషం వేసింది. అతను ఆ దుర్మార్గుడితో పోరాడుతూ వచ్చి, మెల్లగా అతన్ని సముద్రంలోకి నెట్టాడు. దాంతో ఆ రాక్షసుడి శక్తి క్షీణించటం, అతను సాహస వీరుని కత్తికి బలవ్వటం జరిగిపోయింది. దుర్మార్గుడి కథ అట్లా అంతం కావటంతో అందరూ చాలా సంతోషించారు.

"మహిమలతో గొప్ప శక్తులు సంపాదించటం‌ కంటే స్వశక్తిమీద ఆధారపడటమే మంచిది. అంత ప్రమాదకరమైన చెట్టుని భద్రంగా ఉంచి కాపాడుకుంటూ రారాదు- దాన్ని ముందుగానే నాశనం చేసేసి ఉంటే సరిపోయేది. అయినా మనం చేయాల్సిన పనిని ఆ దుర్మార్గుడే చేసాడు- చెట్టును పెరికివేసి చాలా మంచి పని చేశాడు!" అన్నాడు సాహసవీరుడు, సత్కారాలు అందుకుంటూ.