సోమయ్య ,రాజయ్య, బసవయ్య ముగ్గురూ చాలా తెలివైనవాళ్లని ప్రతీతి. ఆ ఊరిలోనే వీళ్లంత తెలివైనవాళ్ళు లేరు.

వాళ్ళు ముగ్గురికీ ఒకసారి అనిపించింది-"ఇంత తెలివి తేటలు ఉన్నవాళ్లం; ఒకసారి రాజుగారి మెప్పు పొందితే బాగుంటుంది కదా" అని, ముగ్గురూ బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళారు.

"మహారాజా! మేం ముగ్గురం మా తెలివితేటల ఆధారంగా అనేక సమస్యల్ని పరిష్కరించాం. ఇన్నేళ్లకు మీ మెప్పు పొందాలని వచ్చాం. మా తెలివిని పరీక్షించి తగిన బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం" అన్నారు.

"ఓ, తప్పకుండా! అలాగే చేద్దాం" అన్నాడు రాజు, భటులను పిలిచి వారికి ఏదో చెబుతూ.

రాజ భటులు ఒక పెద్ద పెట్టెను తెచ్చి అక్కడ దింపారు- "సరే, తెలివిగల పిల్లలూ, ఇప్పుడు చెప్పండి, ఈ పెట్టెలో ఏముంది?" అని వాళ్ళు ముగ్గురినీ అడిగాడు రాజు.
ముగ్గురూ ఒక్కసారిగా అన్నారు: "అందులో మామిడి పళ్ళు ఉన్నాయి!" అని.

రాజయ్య అన్నాడు- "అందులో నిండా పళ్ళు లేవు ప్రభూ! కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నై" అని.

బసవయ్య అన్నాడు- "అవునవును- అందులో మహా ఉంటే ఒక డజను పళ్ళు ఉన్నై" అని.

రాజుగారి ఆజ్ఞ మేరకు పెట్టెని తెరిచారు భటులు- చూస్తే అందులో నిజంగానే డజను మామిడిపళ్ళు ఉన్నాయి! సభికులందరూ ఆశ్చర్యపోయారు.

" 'ఇందులో మామిడి పళ్లే ఉన్నాయి' అని మీకు ఎలా తెలిసింది?" అడిగాడు రాజు.

సోమయ్య అన్నాడు- "ప్రభూ! మామిడిపళ్ళు అంత చక్కని వాసన వేస్తుంటే మరొక ఆలోచన ఎలా వస్తుంది? నేను వాసనను బట్టి ఇవి మామిడి పళ్ళేనని కనుకొన్నాను" అని.

"వాసన ఎలాగూ ఉన్నది- భటులు పెట్టెను తెస్తున్నప్పుడు వాళ్ళు అసలు కష్టపడలేదు- అలవోకగా మోసుకొచ్చారు. దాన్ని బట్టి పెట్టె నిండుగా లేదని అర్థమైంది నాకు" అన్నాడు రాజయ్య.

"ప్రభూ! వాళ్లు పెట్టెను క్రిందికి దింపేటప్పుడు వచ్చిన శబ్దాన్ని బట్టి నేను అందులో సుమారు ఒక డజను పళ్ళు ఉంటాయని ఊహించాను" నవ్వాడు బసవయ్య.

రాజుగారికి వాళ్ళ తెలివితేటలు చాలా నచ్చాయి. ముగ్గురినీ సత్కరించటమే కాక, వారిని తన ఆంతరంగిక సలహాదార్లుగా నియమించుకున్నారు.