గాలి, నీళ్ళు మంచి స్నేహితులు. ఇద్దరూ అనేక జీవరాసులకు ఉపయోగ-పడుతుంటారు.

అయితే మనుషులు నీళ్లను గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు: "ఆ ఊళ్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి- పంటలు బాగా పండుతున్నాయి.

వాళ్లంతా ధనవంతు-లయ్యారు. నీళ్ళు లేని ఊళ్లలో మనుషులు, పక్షులు, జంతువులు, పంటలు లేక కష్టపడుతున్నారు-" ఇలాగ.

ఈ మాటలు విన్న నీటికి గర్వం పెరిగింది. 'గాలి కంటే నేనే ఎక్కువ' అనుకోవటం మొదలు పెట్టింది.

చివరికి అది ఒకరోజు గాలి దగ్గరికి వెళ్ళి అన్నది: జీవరాసులకు మన ఇద్దరిలో ఎవరు ముఖ్యం? చెప్పు!" అని.

"ఇద్దరమూ అవసరమే" అన్నది గాలి.

"అయ్యో, 'మనిద్దరం' అని కలుపుకుంటా-వెందుకు? నీకు ఆకారమే లేదు. నువ్వు అసలు కంటికే ఆనవు. నీ గురించి అయితే ఎవ్వరూ మాట్లాడుకోనే మాట్లాడుకోరు. నీ అవసరం నీకే!" అన్నది నీరు, నవ్వుతూ. "నన్ను చూడు- ఏ పాత్రలోకి పోస్తే ఆ ఆకారంలో ఉంటాను. నేను లేకుంటే పంటలు ఎండిపోతాయి; చెట్లు బ్రతకలేవు ; పక్షులు-జంతువులు బ్రతకలేవు. మరి నేను తలచుకుంటే చాలు- పంటలు పండించ-గలను; వరదలు, కరువు కాటకాలు తెప్పించగలను. జీవరాసులన్నిటి కష్ట సుఖాలలోనూ నా పాత్ర చెప్పలేనంత ఉంది. అవసరం అంటే నేనే కద, నిన్ను నువ్వు కలుపుకునేదెందుకు?" అని విర్రవీగింది.

దాని మాటలకు గాలి నొచ్చుకున్నది, చిన్నబోయింది. "మిత్రమా! జీవరాసులకు నీ అవసరం చాలా ఉన్నది. అయినా నేను కూడా ముఖ్యమే" అన్నది మెల్లగా.

నీరు ఇంకొంచెం వెటకరించింది- "అలా అనకు! జీవరాసులకే కాదు, నీకు కూడా నా అవసరం ఎంతో ఉంది!! ఎందుకంటే, నేను లేకుంటే చెట్లు
బ్రతకవు- గాలి వీచదు మరి!!" అని సంతోషపడింది.

గాలి ఉడుక్కున్నది- "ఎవరి ప్రాధాన్యత వారిదిలే- ఈ మాటలు చాలు , ఇంతటితో‌ ఆపుదాం " అని మౌనం వహించింది.

నీళ్ళు మరింత రెచ్చిపోయినై- "ఏనాడూ కంటికి కనిపించవే, నువ్వేనా- ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుందనేది!? ఎట్లా ఉంటుంది ప్రాధాన్యత? నన్ను చూడు- నేను సూక్ష్మ రూపంతో, కంటికి కనిపించకుండా ఆవిరి అవుతాను- మేఘాలను చేరతాను. ద్రవంగా ఉంటూ ప్రవహిస్తాను. గడ్డకట్టి, ఘన పదార్థంగా మారి మనుషుల అవసరాలు తీరుస్తున్నాను. నేను లేనిదే సృష్టే లేదు. పోటీ పెట్టుకుందాం! ఎవరు గొప్పో ఇప్పుడే తేలిపోతుంది!" అంది.

గాలికి పోటీ పందేలంటే ఇష్టం లేదు. "ఇంత మాత్రం దానికి పోటీ ఎందుకులే, నువ్వే ఎక్కువ" అన్నది.

నీరు నవ్వింది ఎగతాళిగా "ఓహో, ఏం తెలివి! ఎట్లాగూ ఓడిపోతానని ఎంత ఉలుకో చూడు! 'పోటీ ఎందుకు' అని వగలు పోతున్నావు!" అంది నిష్టూరంగా.

ఇంక పోటీకి ఒప్పుకోక తప్పలేదు గాలికి.

'ఆహారమయ్య' అనే రైతుకుటుంబం మీద ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ. ఆహారమయ్య భార్య లేస్తూనే- నీళ్ళు కాస్తుంది, వంటచేస్తుంది. ఆహారమయ్య తోటకు నీరు పెడతాడు. పిల్లలు ఉడుకు నీళ్ళతో‌ స్నానాలు చేస్తారు. భోజనాలు చేసి నీళ్ళు త్రాగుతారు. స్కూలు కెళుతూ నీళ్లు తీసుకెళ్తారు. అయితే ఆరోజు కొంతసేపు నీళ్ళు వచ్చాయి- తర్వాత ఆగిపోయాయి. తోట సగానికి పైగా తడవనే లేదు. రైతుకే కాదు, రైతు భార్యకు, పిల్లలకు అందరికీ చాలా కష్టమైంది. "నీళ్ళు లేవు-నీళ్ళు లేవు " అని గగ్గోలు పడ్డారు. "చూశావా, నేను ఎంత గొప్పదాన్నో! ఎంత మంది నామీద ఆధారపడి బ్రతుకుతున్నారో చూశావా!" అన్నాయి నీళ్ళు.

"అవునవును- నిజం. నువ్వే అవసరం వాళ్ళకి!" అన్నది గాలి.

"ఇప్పుడు నీ వంతు. నీ బలం ఎంతో‌ చూపించు!" అన్నది నీరు.

"ఎందుకూ, పాపం చాలా కష్టం అవుతుంది. వద్దులే" అన్నది గాలి.

నీరు ఊరుకోలేదు. చివరికి గాలి ఒప్పుకున్నది- "పదే పది క్షణాలు- ఏమౌతుందో చూడు, జాగ్రత్తగా" అన్నది. ఆహారమయ్య కుటుంబం నుండి మాయమైంది.

అంతే! అందరూ గొంతులు పట్టుకున్నారు. "అ..అ..అఁ.." అన్నారు. క్రింద పడిపోయారు. ఊపిరాడక, వాళ్ల ముఖాలు నీలం రంగుకు తిరిగాయి. స్పృహ తప్పారు. అంతలోనే గాలి తిరిగి వచ్చింది. వాళ్ల ప్రాణాలు కాపాడింది.

నీరు అవాక్కయింది. గాలి వివరించింది- "మిత్రమా! ప్రపంచంలో ఏది కదలాలన్నా నేను అవసరమే. జీవుల శరీరాలలోను, ఖాళీగా కనబడే స్థలాలన్నిటిలోనూ- అంతటా నేను ఉన్నాను, కంటికి కనబడను అంతే. నేను లేనిదే ప్రాణమే లేదు. అంతెందుకు, నీలోనే నేనున్నాను. ప్రాణుల మనుగడ నేను లేనిదే అసలు వీలవదు" అన్నది.

"మిత్రమా! నన్ను క్షమించు. నువ్వు కంటికి కనబడవు కదా, నీ గొప్పను గుర్తించలేకపోయాను నేను. నాకంటే నువ్వే గొప్పదానివి!" అన్నది నీరు, సిగ్గుపడుతూ.

గాలి నవ్వింది- "లేదు మిత్రమా! మనం ఇద్దరమూ గొప్ప వాళ్లమే. మనం ఇద్దరం లేకపోతే ఈ భూమికి, మిగతా గ్రహాలకు తేడా ఉండేది కాదు.

ప్రాణికోటి మనుగడకు మనం ఇద్దరమూ అవసరమే!" అన్నది.